కాదు, మీరు ఇలా చెప్పండి: 'మేము విన్నాము. శిరసావహించాము. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరికి మేమంతా నీవైపునకే మరలివస్తాము'
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: "ఆకాశాలలో, భూమిపై ఉన్న సమస్తమూ అల్లాహ్ దే. మీరు మీ మనస్సులలో ఉన్న విషయాలను వెల్లడి చేసినా లేక దాచినా, వాటి గురించి అల్లాహ్ మీతో లెక్క తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతి దానిపై సర్వశక్తిమంతుడు" [అల్ బఖరహ్ 2:284] అన్న ఖుర్ఆన్ వచనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులకు అది భారంగా తోచింది. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి తమ మోకాళ్ళపై కూర్చొని, “ఓ రసూలుల్లాహ్! మాలో నిర్వర్తించగల శక్తి ఉన్న ఆచరణలే మాపై మోపబడ్డాయి: నమాజ్, ఉపవాసాలు, జిహాద్ మరియు దానధర్మాలు. కాని ఇప్పుడు మీపై ఈ ఆయతు అవతరించింది. దీనిని భరించే శక్తి మాలో లేదు” అని విన్నవించుకున్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «మీకు పూర్వం గ్రంథప్రజలు (యూదులు, క్రైస్తవులు) "మేము విన్నాము కాని అంగీకరించట్లేదు" అన్నట్లుగా మీరు కూడా అలాగే జవాబు చెబుదామని అనుకుంటున్నారా ఏమిటి? కాదు, మీరు ఇలా చెప్పండి: 'మేము విన్నాము. శిరసావహించాము. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరికి మేమంతా నీవైపునకే మరలివస్తాము'». వారు అన్నారు: "మేము విన్నాము. శిరసావహించాము. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరికి మేమంతా నీవైపునకే మరలివస్తాము". ప్రజలు ఆ వచనాలను పలుకగా, వారి నాలుకలు వాటితో పలచబడిన తరువాత, అల్లాహ్ దాని వెనుకే ఈ ఆయతును అవతరింపజేశాడు: {ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించిన దాన్ని విశ్వసించాడు. ఈ ప్రవక్తను అనుసరించే వారు కూడా దానిని హృదయపూర్వకంగా స్వీకరించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారు ఇలా అంటారు: మేము ఆయన ప్రవక్తలలో ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాం. శిరసా వహించాం. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీవైపునకే మరలి వస్తాము} [అల్ బఖరహ్ 2:285]. వారు అలా చేయగానే, అల్లాహ్ దానిని రద్దుపరచి, ఈ ఆయతును అవతరింపజేశాడు: {ఏ ప్రాణిపైనా అల్లాహ్ దాని శక్తిసామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్నీ, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్నీ ప్రతి వ్యక్తీ అనుభవిస్తాడు. ఓ మా ప్రభూ! మేము మరచినా లేక తప్పు చేసినా మమ్మల్ని పట్టుకోకు} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు. {ప్రభూ! మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై మోపకు!} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు. {ప్రభూ! ఏ బరువును మోసే శక్తి మాలో లేదో, దానిని మాపై మోపకు} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు. {మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మమ్మల్ని క్షమించు. మమ్మల్ని కరుణించు. నీవు మాకు రక్షకుడవు. అవిశ్వాసులకు వ్యతిరేకంగా నీవు మాకు సహాయపడు} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు.
Explanation
Benefits
పవిత్ర ఖుర్ఆన్ లో ఆయతుల రద్దు నిరూపితమై ఉన్నది మరియు ఖుర్ఆన్ లో కొన్ని ఆయతులు పఠించబడతాయి కానీ వాటి ఆదేశము రద్దు చేయబడినది, కావున వాటిపై ఆచరించబడదు.
అల్లాహ్ ఆజ్ఞకు సంపూర్ణ విధేయత చూపడంలో మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞను అనుసరించడంలో సహాబాల రదిఅల్లాహు అన్హుమ్ ఘనత.
గత సమాజాలు అల్లాహ్ తఆలా ఆదేశాలను తిరస్కరించి అనుసరించిన మార్గాన్ని తన ఉమ్మత్ కూడా అనుసరిస్తుందేమోనని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ పట్ల తీవ్రమైన భయాన్ని కలిగి ఉండేవారు.
సర్వోన్నతుడైన అల్లాహ్ ఆదేశానికి శిరసావహించడం విధి మరియు ఆయన ఆదేశాన్ని వ్యతిరేకించడంలో గ్రంథప్రజల సారూప్యతను కలిగి ఉండటం నుండి హెచ్చరిక ఉన్నది.
పూర్వపు సమాజాలపై ఈ ఉమ్మతు యొక్క ప్రాధాన్యతను గూర్చిన వివరణ ఉన్నది. ఎందుకంటే వారు తమ ప్రవక్తలతో, "మేము విన్నాము మరియు అవిధేయత చూపాము" అని అన్నారు. అయితే ఈ ఉమ్మతు, "మేము విన్నాము మరియు విధేయత చూపాము" అని పలికింది.
ఈ ఉమ్మత్ యొక్క ఘనత, దాని నుండి సంకటాన్ని ఎత్తివేయడంలో, మతిమరుపు మరియు పొరపాటు పట్టుకోబడకూడదని చేసిన ప్రార్థన స్వీకరించబడటంలో, గత సమాజాలపై ఉన్న భారాలను ఎత్తివేయడంలో, మరియు అది భరించలేని భారాన్ని దానిపై మోపకపోవడంలో ఉంది.
మహోన్నతుడైన అల్లాహ్ మన శక్తికి మించిన భారాన్ని మనపై మోపడు, మరియు మన హృదయాలలో మెదిలే దురాలోచనల వైపు మనం మొగ్గు చూపనంత వరకు, వాటితో సంతృప్తి చెందనంత వరకు, మరియు వాటిని ఆచరించనంత వరకు, అవి మనకు హాని కలిగించవు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాల రదియల్లాహు అన్హుమ్ తరువాత వచ్చేవారి కోసం కూడా ఇది ఒక దుఆగా ఉండాలనే ఉద్దేశ్యంతో, అల్లాహ్ తన గ్రంథంలో ఈ దుఆను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు విశ్వాసుల పక్షాన తెలియజేశాడు. కావున, ఈ దుఆను కంఠస్థం చేయడం మరియు దీనిని అధికంగా పఠించడం వాంఛనీయం.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

